ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను రోజువారీ తనిఖీలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున శనివారం ఉదయం పరిశీలించారు. పోలీసు జాయింట్ కమిషనర్ ఫక్కీరప్ప, ఏడీసీ కెఎస్.విశ్వనాథన్లతో కలిసి పార్లమెంటు, అంసెబ్లీ ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన ఆయన అక్కడి పరిస్థితులను గమనించారు. భద్రతాపరమైన చర్యలను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, మానిటరింగ్ రూమ్ ద్వారా పర్యవేక్షణ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు వహిస్తూ పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల ఆర్ఒలు, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.
![strong rooms, collector check](https://prajasakti.com/wp-content/uploads/2024/05/1-Strong-rooms.jpg)