ప్రజాశక్తి- ములగాడ : జివిఎంసి 63వ వార్డు పరిధి క్రాంతినగర్లో సిపిఎం ఏరియా కమిటీ ఆధ్వర్యాన శరగడం జగ్గయ్యమ్మ 5వ వర్థంతిని ఆదివారం నిర్వహించారు. ముందుగా జగ్గయ్యమ్మ చిత్రపటానికి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు, సిఐటియు జిల్లా నాయకులు పి.వెంకటరెడ్డి పూలమాలవేసి నివాళుర్పించారు. ఏరియా కార్యదర్శి పి.సూర్యనారాయణ (సురేష్) అధ్యక్షతన జరిగిన సభలో జగ్గునాయుడు మాట్లాడుతూ, జగ్గయ్యమ్మ ఎకెసి, ఆంధ్ర స్టీల్లో పనిచేసి సిఐటియులో చేరి కార్మిక సమస్యలపై అనేక పొరాటాలు చేశారని తెలిపారు. ఎకెసి యాజమాన్యం దుర్మార్గాలను ఎదిరించి పోరాడారని కొనియాడారు. ఎకెసి, ఆంధ్ర స్టీల్ కాలనీలో ఐద్వా సంఘం ఏర్పాటుచేసి స్థానిక సమస్యలపై పనిచేశారని చెప్పారు. క్రాంతినగర్లో ఇల్లు నిర్మించుకున్నాక ఇక్కడ ఐద్వాలో పనిచేస్తూ మహిళను ఐక్యంచేసి పేదలకు ఇళ్ల కోసం భూపొరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఏపనైనా పట్టుదలగా, నిజాయితీగా పనిచేశారని కొనియాడారు. ఆమె కుమారుడు, కోడల్ని కూడా సిపిఎం చేర్పించారని తెలిపారు. క్రాంతినగర్ గ్రామ సమస్యలపై పనిచేశారని చెప్పారు. తుదిశ్వాస వరకు సిపిఎం సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారన్నారు. ఆమె ఆశయాల బాటలో నడిచినప్పుడే మన మిచ్చిన అసలైన నివాళి అని పేర్కొన్నారు. సిఐటియు జిల్లా నాయకులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ, జగ్గయ్యమ్మ ధన్యజీవి అన్నారు. కార్మిక, ప్రజా పొరాటాలు ఎప్పుడూ ఓడిపోవని చెప్పారు. ఈ వర్థంతిసభలో సిపిఎం మల్కాపురం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు, క్రాంతినగర్ గ్రామ అధ్యక్షులు కె.పరదేశినాయుడు, ఐద్వా క్రాంతినగర్ కమిటీ కార్యదర్శి వై.కల్యాణి, ఐద్వా రాష్ట్ర నాయకులు ఆర్.విమల, సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణమూర్తి, కెవిపిఎస్ జోన్ నాయుకులు కె.పెంటారావు, భవన నిర్మాణ సంఘం నాయకులు డి.గోపాల్ సభలో ప్రసంగించారు. సిపిఎం జోన్ నాయకులు భాస్కరరావు ఆహ్వానం పలికారు. విసిసి బాలల కోలాటం చూపరులను ఆకట్టుకుంది.
![Jaggayyamma Vardhanthi](https://prajasakti.com/wp-content/uploads/2024/07/1-Jaggunaidu.jpg)