ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం, మర్రిపాలెం తదితర ప్రాంతాల్లో జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వివి.లక్ష్మీనారాయణ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం తాటిచెట్లపాలెంలోని దర్గాకు చేరుకుని ముస్లిం సోదరులను కలిసి వారి మద్దతు కోరారు. టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ముస్లిం మైనార్టీ సోదరులందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉత్తర నియోజకవర్గానికి ప్రత్యేకించి మేనిఫెస్టో తయారుచేశానని, తాను గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టోను అమలు చేసి అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తానని చెప్పారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆర్థికంగా బలపడేందుకు ప్రణాళికలు రూపొందించానని తెలిపారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేపట్టారు. తమ విలువైన ఓటును అమ్ముకోకుండా నిజాయతీపరులకు వేయాలని కోరారు. తాను సంపాదన మీద ఆశతో కాకుండా మెరుగైన సమాజం నిర్మించాలన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తనను ఒక్కసారి గెలిపించి చట్టసభకు పంపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానన్నారు. అనంతరం నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.