ప్రజాశక్తి – కాకినాడ
జిల్లాలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా-2024లోని అంశాలు, మార్పులు చేర్పులు, 18-19 మధ్య వయసున్న యువత ఓటు నమోదు, పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, ఈ -ఎపిక్ కార్డుల పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు, ఈవిఎం, వివిప్యాట్ల ద్వారా ఓటింగ్ విధానంపై అవగాహన వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతి నిధులతో చర్చించారు. కాకినాడ పార్లమెంటు స్థానం తోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. ఓటు హక్కు నమోదు నిరంతరం కొనసాగే ప్రక్రియన్నారు. జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందన్నారు. ఓట్ల తొలగింపులో ఎటువంటి అపోహలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 20 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ లైవ్ విధానంలో పోలింగ్ను నిర్వహిస్తామని వివరిం చారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కు అవసరమైన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయ డం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఒ డి.తిప్పేనాయక్, రాజకీయ పార్టీల ప్రతి నిధులు రావూరి వెంకటేశ్వరరావు (వైసిపి), గదులు సాయి బాబా(టిడిపి), సబ్బారపు అప్పారావు(బిఎస్పి), కె.వీరబాబు(సిపిఎం), కాళ్ళూరి కృష్ణమోహన్(ఆప్), పెద్దిరెడ్డి రవికిరణ్ (బిజెపి), కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిటి ఎం.జగన్నాథం, పాల్గొన్నారు.