ప్రజాశక్తి – ఏలేశ్వరం
ప్రత్తిపాడు నియోజకవర్గంలో గల ప్రాజెక్టులు నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపాడు నియోజక వర్గ టిడిపి ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ ఆరోపించారు.మంగళవారం టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఏలేరు రిజర్వాయర్, చంద్రబాబు సాగర్, సుబ్బారెడ్డి సాగర్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్కి తరలించేందుకు గత ప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మించిందన్నారు. దీని ద్వారా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏలూరు జలాశ యానికి 16 టిఎంసిల నీరు తరలించేందుకు అవకాశం ఉన్న ప్రభుత్వం పట్టించుకోక పోవడం పట్ల ఏలేరు జలాశయం నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ఏలేరు ఆయకట్టు కింద 97 వేల ఎకరాలు సాగులో ఉండగా, 5 మండలాల ప్రజలకు, పశువులకు నీటి సరఫరాతోపాటు విశాఖకు నీరు తరలించే అవకాశం ఉండగా ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వలన రానున్న వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొవాల్సి వస్తాదన్నారు. ఏలేరు రిజర్వాయర్, చంద్రబాబు సాగర్, సుబ్బారెడ్డి సాగర్ ఆధునీకరణ పనులు కనీసం పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.