పోలీస్ స్టేషన్లో అంగన్వాడీల ఫిర్యాదు
4వ రోజుకు చేరిన అంగన్ వాడిల సమ్మె
ప్రజాశక్తి – పెద్దాపురం : అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాలుగవ రోజుకు చేరుకుంది. మున్సిపల్ సెంటర్ లో సమ్మె శిబిరం కొనసాగింది. ఈ శిబిరంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి అంగన్వాడీలు సమ్మెలో ఉండగా అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సై వి సురేష్ కు పిర్యాదు అందజేశారు. సెంటర్లో రికార్డులు, సామాన్లు పోతే తమకు సంబంధం లేదని, అందుకు ఐసిడిఎస్ అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డాడీ బేబీ అధ్యక్షతన జరిగిన సమ్మె శిబిరంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చెక్కల రమణి షమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ దగ్గర ఉండి మరీ అంగన్వాడి సెంటర్ తాళాలు బద్దలు కొట్టించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి క్రాంతి కుమార్, అంగన్వాడీ యూనియన్ నాయకులు నాగమణి, అమల, వరలక్ష్మి, ఫాతిమా, ఎస్తేరు రాణి, వన కుమారి, వసంత, తులసి, పద్మ, స్నేహలత, నెహ్రూ కుమారి, కాలే దేవి, జె సూర్య కుమారి, జ్యోతి, మాచరమ్మ, లోవ తల్లి తదితరులు పాల్గొన్నారు.