ప్రజాశక్తి – కాకినాడ
ఈనెల 25న కాకినాడలో సుమారు రూ.114 కోట్లతో నిర్మించిన ఇఎస్ఐ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారని ఎంపి వంగా గీత వెల్లడించారు. ఆసుపత్రి ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2020లో ఆసుపత్రి నిర్మాణం పనులను ప్రారంభించినట్లు తెలిపారు. నిర్మాణ సమయంలో కరోన, భారీ వర్షాలు ఆటకం పరిచినా సకాలంలో పూర్తిచేసిన వైద్య విభాగ నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంఎల్ఎ ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కాకినాడ నుంచి ఇఎస్ఐ ఆసుపత్రి తరలిపోతుండగా తామే కాకినాడలో ఏర్పాటు చేయాలని సిఎం జగన్కు సూచించినట్లు తెలిపారు. కార్మికులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించనున్నామని, ఆసుపత్రి సకల సౌకర్యాలతో నాలుగు ఆపరేషన్ థియేటర్లతో నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అదనపు కమిషనర్ సిహెచ్.నాగనరసింహారావు, ఎంహెచ్ఒ డాక్టర్ పృథ్వీచరణ్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు, ఎంఇ పి.సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు.