ప్రజాశక్తి – పెద్దాపురం : ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు)ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మున్సిపల్ వర్కర్స్ నిరవధిక సమ్మె ఆదివారం 6 వ రోజుకు చేరుకుంది.స్థానిక మున్సిపల్ సెంటర్లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శివకోటి అప్పారావు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే సమ్మెను పరిష్కరించవలసింది పోయి పోటీ కార్మికులను పెట్టి పని చేయించే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు.కార్మికుల మధ్య గొడవలు, కొట్లాటలు పెట్టేందుకు అధికారులు, ప్రభుత్వం ప్రయత్నించటం దారుణ మన్నారు.ఇప్పటికే అనేక చోట్ల మున్సిపల్ కార్మికులు పోటీ కార్మికులను అడ్డుకున్నారన్నారు.తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందన్నారు.కనీస వేతనాల కోసం,ఉద్యోగ భద్రత కోసం సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివకోటి అప్పారావు,భూపతి శ్రీను,మడికి కృష్ణ,చేపల అర్జయ్య,వర్రే రాజేష్,మడికి మోహన్ రావు,దోనం దేవి ప్రసాద్,దొండపాటి సురేష్,దొండపాటి శేఖర్,వర్రె రమణ,సురేష్,పలివెల అప్పారావు,దొండపాటి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.