తలకిందులుగా నిలబడి నిరసన తెలుపుతున్న కార్మికులు
ప్రజాశక్తి – ఎమ్మిగనూరు
రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల పట్ల నిరంకుశ విధానాలు అవలంభించకుండా తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కార్మికులు తలకిందులుగా నిలబడి నిరసన చేపట్టారు. బుధవారం మున్సిపల్ కార్మిక సంఘాలు, సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పట్టణంలో 16వ రోజు సమ్మె సందర్భంగా సమ్మె శిబిరంలో కార్మికులు తలకిందులుగా నిలబడి నిరసన తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు గోవిందు, రాముడు, ఎఐటియుసి తాలూకా సహ కారదర్శి రంగన్న, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి మహేంద్ర మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 15 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం దిగి రాకపోవడం దారుణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. ఎఐటియుసి తాలూకా సహాయ కార్యదర్శి విజయేంద్ర, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు ఎల్లప్ప, శివ, వీరేష్, నాగప్ప, రాము, అల్లాబకాష్, కేశన్న, రంగన్న, లక్ష్మన్న, ఖాజా, ప్రతాప్, ఆరిఫ్ పాల్గొన్నారు.