రెగ్యులరేజ్‌ చేసి పనికి తగ్గ వేతనమివ్వాలి

Jan 5,2024 20:29

ఆదోనిలో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న
ప్రజాశక్తి – ఆదోని
మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌ కార్మికుల సర్వీసు పరిగణనలోకి తీసుకొని రెగ్యులరైజ్‌ చేసి, సమాన పనికి సమాన వేతనమివ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.ఈరన్న, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పిఎస్‌.గోపాల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆదోనిలోని పంపు హౌస్‌ నుంచి భీమాస్‌ సర్కిల్‌ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం ఇవ్వాలని కోరారు. యూనిఫారం ఇవ్వాలని, మాస్టర్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 101 పద్ధతి కింద వేతనాలు ఇవ్వాలని, పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని కోరారు. పెరిగిన నిత్యావసర ధరల ప్రకారం వేతనాలు పెంచాలని, ఇంజినీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాట్యుటీ, చివరి జీవితంలో సగం పింఛనుగా ఇవ్వాలని, పర్మినెంట్‌ సిబ్బందికి సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేయాలని కోరారు. ఎమ్మిగనూరులో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరింది. కార్మికులు మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన చేపట్టారు. సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు తాలూకా నాయకులు రాముడు, రంగన్న, రాజు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఇస్మాయిల్‌, నాగరాజు, సాల్మన్‌ పాల్గొన్నారు.

➡️