ప్రజాశక్తి -గాజువాక : సామాజిక సేవలో భాగంగా గాజువాక లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన జగ్గు జంక్షన్ కూడలిలోని క్లబ్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాజువాక లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిక్కా సత్యనారాయణ మాట్లాడుతూ, వేసవిలో రక్త నిల్వలు తక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం చాలక చాలామంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోగులకు అండగా ఉండడం కోసం ప్రాంతాల వారీగా శిబిరాలు నిర్వహించి, ప్రజా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలన, అక్షరాస్యత సాధన, బాల్య వివాహాలను అరికట్టడం, పోలియో నిర్మూలన వంటి కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యంగా తమ క్లబ్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి వెంకటరెడ్డి, లయన్స్ క్లబ్ కార్యదర్శి సత్యాల కోటేశ్వరరావు, గాజువాక క్లబ్ కార్యదర్శి కృష్ణకుమార్, జీవన్ బాబు, అచ్యుతరావు, నున్న శ్రీనివాసరావు, బోయిన బాబూరావు, తిప్పల అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్త దాతల నుంచి రక్తాన్ని సేకరించారు.