పార్వతీపురంరూరల్ : సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సామాగ్రి స్వీకరణ, లెక్కింపు కేంద్రం వద్ద ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులు ప్రమోద్ కుమార్ మొహర్థ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఉద్యాన కళాశాలలో ఎన్నికల సామాగ్రి స్వీకరణ రిసెప్షన్ కేంద్రానికి సంబంధించి ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నాలుగు నియోజక వర్గాలకు వేర్వేరుగా కేటాయించిన శిబిరాల్లోని కౌంటర్ల వద్ద టేబుళ్లు, కుర్చీల ఏర్పాటును, పోలింగ్ అనంతరం పిఒలు, ఎపిఒ ల స్క్రూటినీ, స్వీకరణకు కల్పించిన వసతులు, తదితర అంశాల ఏర్పాట్లపై కలెక్టర్ వివరించారు. అలాగే లెక్కింపు కేంద్రాల వద్ద బారికేడ్లు, గోడలకు మెస్ ఏర్పాటును నిశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల సామాగ్రి స్వీకరణ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇవిఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరును వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతర నిఘా, పర్యవేక్షణ కోసం వసతి కల్పనను చూశారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు సులువుగా చేరుకొని రాక పోకలకు అంతరాయం కలగకుండా కళాశాల ముందు భాగంలో అనువైన బస్ల పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేసి అదే స్థలంలో బస్లను నిలిపివేయనున్నట్టు తెలిపారు. అనంతరం కేటాయించిన ప్రతి విభాగాన్ని సందర్శించారు.