గుమ్మలక్ష్మీపురం: మే డే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకొని శ్రామిక దోపిడీ ప్రభుత్వాలను ఓడించే దిశగా కార్మికులంతా ఐక్యం కావాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా గుమ్మలక్ష్మీపురంలో ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో మేడే జెండాను సిపిఎం సీనియర్ నాయకులు మండంగి రమణ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాట ఫలితంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శ్రామికుల శ్రమ దోపిడీని దోచుకోవడమే పరమావధిక పాలన సాగిస్తుందని విమర్శించారు. 8 గంటల పని సమయాన్ని 12 గంటలు చేసే దిశగా మోడీ ప్రభుత్వం చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. గిరిజనులకు రాజ్యాంగం కేటాయించిన హక్కులు, చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసి పాలన సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మేడే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోలక అవినాష్, పువ్వల మోహనరావు, కె.గౌరీశ్వరరావు, పాండు రంగారావు, బిడ్డిక ఆడిట్, శంకర్రావు, సత్యం తదితరులు ఉన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/mayday.jpg)