శివం దళితులకు పరామర్శ

Jun 29,2024 10:49 #Manyam District

ప్రజాశక్తి-గరుగుబిల్లి : అగ్రకుల పెత్తందార్ల దాడిలో గాయపడిన శివం దళితులను సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాల నాయకులు పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… గరుగుబిల్లి మండలం, శీవ్వాంలో దళితులపై దాడి చేసిన పెత్తందార్లపై ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గొర్రెలు వెంకటరమణ మాట్లాడుతూ 1970లో 14 మందికి సుమారు 25 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చారని, వాటిపై విత్తనాలు పోసి సాగు చేస్తుంటే ఈ రోజు పెత్తందార్లు కత్తులు కర్రలు, ఇతర మారణ ఆయుధాలతో దాడి చేశారని అన్నారు. మరికొంత మందితో వెళ్లి దళితులు సాగు చేసుకుంటున్న భూమిని దురాక్రమణ చేయడానికి చూసారని, వారిని దళితులు అడ్డుకోవడానికి చూస్తే పెత్తందార్లు దళిత మహిళలపై అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహించారు. ఒక దళిత మహిళ దుస్తులను చింపి వేశారని, ఈ క్రమంలో ఆమె వీపుపై గాయం అయ్యిందని అన్నారు. మరికొంత మంది దళితులకి తలపైన, శరీరంపైన గాయాలు అయ్యాయని అన్నారు. పెత్తందార్లు కులం పేరుతో దూషించారని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే పెత్తందార్లపై ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసులు, క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

➡️