ప్రజాశక్తి -భీమునిపట్నం : గెలుపు, ఓటములతో నిమిత్తం లేకుండా వైసిపి కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటానని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అత్యంత పారదర్శకంగా అమలు చేసినట్లు వివరించారు. ‘బటన్ నొక్కి డబ్బులు ఇచ్చారు అన్నారే గానీ తిన్నారు’ అన్న అపవాదు ఎక్కడా మూటగట్టుకోలేదని స్పష్టం చేశారు. పార్టీ, వైసిపి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రతి సందర్భంలోనూ నిత్యం ప్రజల్లో ఉన్నానని చెప్పారు. ఇప్పుడే కాదు భవిష్యత్లో కూడా నిత్యం ప్రజల్లో ఉంటానని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.