సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు నరసింహ
దళితులపై పెరిగిన దాడులు
కెవిపిఎస్ జిల్లా నాయకులు పుల్లా నరసింహులు
ప్రజాశక్తి – నంద్యాల
కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన దాడులు పెరిగాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా నాయకులు పుల్లా నరసింహులు పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని ఎమ్మెస్ నగర్లో క్యాండిల్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి పీటర్ పాల్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పుల్లా నరసింహులు హాజరై మాట్లాడారు. కేంద్రంలో బిజెపి దళితులపైన, మైనార్టీలపైన దాడులు విపరీతంగా చేస్తుందని అన్నారు. బిజెపికి తొత్తులైన విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ లాంటి సంస్థలు దళితులపై, మైనార్టీలపై దాడులు చేయడమే వారి ఉద్దేశ్యంగా పెట్టుకున్నాయన్నారు. మణిపూర్ లాంటి రాష్ట్రాలలో ఇంకా దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. 2024లో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే మనుధర్మ శాస్త్రాన్ని కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. కాబట్టి దళితులందరూ బిజెపిని వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలో వైసిపి కూడా బిజెపి విధానాలను అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా విషయంలో మోసం చేసిన బిజెపిని సపోర్ట్ చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మివేయాలనుకోవడం దారుణమన్నారు. కడప స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తామని ఇప్పుడు బిజెపి చేతులెత్తేసిం దన్నారు. వైజాగ్ పోర్టు, గన్నవరం పోర్టు రాష్ట్రంలో ఉన్న పోర్టులన్నింటినీ ఆదాని సంస్థకు అప్పజెప్పడం దుర్మార్గమన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ హౌదా గుర్తిస్తామన్న బిజెపి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. రాష్ట్రానికి ఇంతటి ద్రోహం చేసిన బిజెపి భుజాన వేసుకొని వస్తున్న వైసిపిని కూడా దళితులందరూ ఏకమై వ్యతిరేకించాలని కోరారు. అనంతరం క్రిస్టియన్ జెఎసి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి మన్యం జానయ్య ప్రసంగించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఆర్ఒ జేమ్స్, రిటైర్డ్ ఎస్సై సామెల్, బ్రదర్ ఏసన్న తదితరులు పాల్గొన్నారు.