ప్రజాశక్తి-విజయనగరం కోట : సమ సమాజ స్థాపనే సమాసమాజ్ వాది పార్టీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి వ్యవస్థాపక సభ్యులు బచ్చుల జగదీష్ యాదవ్ అన్నారు. సోమవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాలకు వెన్నుముక అయిన ఉత్తరప్రదేశ్లో పోరాడుతున్నామంటే దేశం కోసం పోరాడినట్టే అన్నారు. సమసమాజ స్థాపన లక్ష్యంగా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 80శాతం పైగా ఉన్న బిసి, ఎస్సి, మైనార్టీ మిగతా సామాజిక వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయన్నారు 2024 ఎన్నికలో ఏరికోరి మంచి సేవాభావం కలిగిన అభ్యర్థులను 39 మంది ఎమ్మెల్యేలను, ఏడుగురు ఎంపీలను పోటీలో దించామన్నారు. మన జీవితాలు పిల్లల భవిష్యత్తు బాగు చేసుకోవాలంటే తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో విశాఖపట్నం, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థులు డాక్టర్ అచ్చయ్య నాయుడు, సామిరెడ్డి, విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి పెనుమత్స కరుణాకర్, నెల్లిమర్ల నియోజకవర్గ అభ్యర్థి కర్రి కృష్ణ, ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు.