అవస్థలు పడుతున్న వాహనదారులు
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి- కోటవురట్ల: వాహనాల వేగాన్ని నియంత్రించి, ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవాల్సి స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవ్వడమే కాకుండా, ప్రమాదాలు జరిగే పరిస్థితులు నెలకొనడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. అంతేకాక దీని వల్ల వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలువినిపిస్తున్నాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిలో ఏర్పాటుచేసిన స్పీడ్ బ్రేకర్లతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా భారీ ఎత్తున స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి స్పీడ్ బ్రేకర్ వద్ద రోడ్డుపై కంకర, మట్టి, ఇసుక వంటివి పేరుకుపడడంతో అటుగా వచ్చిన వాహనాలు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక భారీఎత్తుతో ఇక్కడ ఏర్పాటుచేసిన స్పీడ్ బ్రేకర్ వద్ద వర్షం వస్తే నీరు నిలబడి మరింత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది, గ్రామ పంచాయతీ, మండల స్థాయి అధికారులతోపాటు సంబంధిత,రహదారులు భవనాల శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, స్పీడ్బ్రేకర్ ఏర్పాటుతో కొత్తగా తలెత్తిన సమస్యను పరిష్కరించాలని స్థానికులు,వాహనదారులు కోరుతున్నారు.
స్పీడ్ బ్రేకర్ కనిపించకుండా రోడ్డుపై నిలిచిన నీరు..