వికలాంగ విద్యార్థులకు నీటి బాటిళ్లు అందజేస్తున్న జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి
హిందూపురం : అంగవైకల్యం విభిన్న ప్రతిభావంత విద్యార్థులకు ఏమాత్రం శాపం కారాదని జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ఎంజిఎం పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రంలో శనివారం జరిగిన జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తల్లిదండ్రులు విభిన్న ప్రతిభావంతుల పిల్లల పట్ల ప్రేమతో వ్యవహరించడంతో పాటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీరిలో ఖచ్చితంగా ఏదో ఒక విభిన్నమైన ప్రతిభ ఉంటుందని దానిని గుర్తించి వెలికితీయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న దివ్యాంగులను ఆదర్శంగా తీసుకొని ఎలాంటి నిరాశకు గురికాకుండా ముందుకెళ్లాలన్నారు. భవిత కేంద్రంలో విద్యుత్ మరమ్మతులకు, విద్యార్థులకు క్రీడా సామగ్రి అందజేస్తానని ఎపిపి ఇందాద్ తెలిపారు. అనంతరం న్యాయమూర్తి దివ్యాంగ విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. న్యాయవాదుల సహకారంతో విద్యార్థులకు నీటి బాటిల్లను అందజేశారు. కార్యక్రమంలో ఎజిపి శ్రీనివాస్రెడ్డి, ఎంఇఒ గంగప్ప, వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ బైసాని రాంప్రసాద్, న్యాయవాదులు సుదర్శన్, నారాయణగౌడ్, సంతోషికుమారి, ఎంజిఎం పాఠశాల హెచ్ఎం సామ్రాజ్యం, భవిత కేంద్రం నిర్వాహకురాలు లలిత, లోక్ అదాలత్ శారద, ఆశా పాల్గొన్నారుపెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిపోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జడ్జి రాజ్యలక్ష్మి సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలో ఈ నెల 9వ తేదీన జరిగే మెగాలోక్అదాలత్పై సిఐలు, ఎస్ఐలు, ఎఎస్ఐలతో సమీక్షించారు. రాజీ కాదగిన క్రిమినల్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐతో పాటు పరిగి, చిలమత్తూరు, హిందూపురం వన్ టౌన్ ఎస్ఐలు పాల్గొన్నారు.