సిబ్బందికి ర్యాండమైజేషన్పై శిక్షణ ఇస్తున్న అధికారులు
పుట్టపర్తి అర్బన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం 915 మంది కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా విధులను కేటాయించినట్లు డిఆర్ఒ కొండయ్య తెలిపారు. శనివారం నాడు కలెక్టరేట్లోని ఎన్ఐసి హాలులో ఎన్నికల కౌంటింగ్ మొదటి రాండమైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటి నోడల్ ఆఫీసర్ రామమోహన్ రావు, నెట్వర్క్ ఇంజినీర్ ఎన్.విజయ కుమార్, టెక్నికల్ అసోసియేట్ ఎం.రవికృష్ణ, ఇడిఎం హరీష్ కుమార్, టెక్నికల్ అసోసియేట్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఒ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ప్రకారం కౌంటింగ్ సిబ్బందికి నియామక ఉత్తర్వులను సంబంధిత తహశీల్దార్ల ద్వారా అందిస్తామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి ఆయా నియోజకవర్గ స్థాయిలో సంబంధిత రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తరగతులకు గైర్హాజరు అయిన సిబ్బందిపై ప్రజాప్రాతినిధ్య చట్టం -1951 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.