ఎదురుచూపులే…

ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 3,50,765 ఎకరాలకు పంటల క్రాపింగ్‌ చేశారు. 3,34,330 ఎకరాలకు

బూర్జ మండలం అన్నంపేట వద్ద ధాన్యాన్ని లోడింగ్‌ చేస్తున్న రైతులు

ధాన్యం కొనుగోలులో వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు

ఇప్పటివరకు 3.60 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు

కొనాల్సింది 5.40 లక్షల టన్నులు

‘జిల్లాలో చివరి గింజ వరకు ధాన్యం కొంటాం. దళారుల ప్రమేయం లేకుండా చేస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.’ ఇవీ ప్రజాప్రతినిధులు, అధికారులు ధాన్యం కొనుగోలు ప్రారంభంలో చెప్పే మాటలు. కొనుగోలు విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ వేగం కనిపించడం లేదు. ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారే తప్ప పని కావడం లేదు. జనవరి మూడో వారంలోకి ప్రవేశించినా ధాన్యం కొనుగోలుకు ఎదురుచూపులే మిగిలాయి. జిల్లాలో నేటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ధాన్యం సిద్ధంగా ఉన్నా కొనుగోలు చేయకపోవడంతో, రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. సాంకేతిక సమస్యలు, ధాన్యం నాణ్యంగా లేకపోవడంతో మిల్లర్లు తీసుకునేందుకు నిరాకరించడం వంటి సమస్యలతో ధాన్యం కొనుగోలు ముందుకు సాగడం లేదు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 3,50,765 ఎకరాలకు పంటల క్రాపింగ్‌ చేశారు. 3,34,330 ఎకరాలకు ఇకెవైసి పూర్తయింది. 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 7,87,447 మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వరికి సాధారణ రకానికి రూ.2,183, గ్రేడ్‌ ‘ఎ’ రకానికి రూ.2,203 మద్దతు ధర ప్రకటించింది. ధాన్యం కొనుగోలుకు అధికారులు జిల్లావ్యాప్తంగా 606 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. రెండు వేలు పైబడి ధాన్యం సేకరించే అవకాశమున్న కేంద్రాలను ఎ-కేటగిరీగా, వెయ్యి నుంచి రెండు వేల టన్నుల్లోపు కొనుగోలు చేసే వాటిని బి-కేటగిరీగా విభజించారు. వెయ్యి టన్నుల కంటే తక్కువ ధాన్యం కొనుగోలుకు అవకాశమున్న వాటిని సి-కేటగిరీగా నిర్ణయించారు.ధాన్యం కొనుగోలుకు అన్నిరకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కొనుగోలు కోసం 606 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 576 కేంద్రాలు తెరుచుకున్నాయి. వీటి ద్వారా 3.60 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో గ్రేడ్‌-ఎ రకం 233 మెట్రిక్‌ టన్నులు కాగా, సాధారణ రకం ధాన్యం 3.60 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేశారు. బ్యాంకు గ్యారంటీలు, సాంకేతిక సమస్యలు వంటి సమస్యలతో ధాన్యం కొనుగోలు సాఫీగా సాగడం లేదు. పండగ వెళ్లినా నేటికీ వేలాది మంది రైతుల వద్ద ధాన్యం ఉండిపోయింది. ప్రభుత్వ అంచనా ప్రకారం ఇంకా సుమారు రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేయాల్సి ఉంది.జిల్లాలో గ్రేడ్‌-ఎ, సాధారణ రకం ధాన్యం కలిపి మొత్తం 3.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కంచిలి, కవిటిలో ఇప్పటివరకు కనీసం వెయ్యి టన్నులనూ కొనుగోలు చేయలేదు. కంచిలిలో అత్యల్పంగా కేవలం 448 మెట్రిక్‌ మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కవిటిలో 677 మెట్రిక్‌ టన్నులు, పొందూరులో 2137 మెట్రిక్‌ టన్నులు, ఎచ్చెర్లలో 2,663 మెట్రిక్‌ టన్నులను కొన్నారు. ఇచ్ఛాపురంలో 2,736 మెట్రిక్‌ టన్నులు, వజ్రపుకొత్తూరులో 3,310 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో అత్యధికంగా జలుమూరులో 30,077 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత స్థానంలో నరసన్నపేట ఉంది. నరసన్నపేటలో 24,473 మెట్రిక్‌ టన్నులు కొన్నారు. సారవకోటలో 22,991 మెట్రిక్‌ టన్నులు, కోటబొమ్మాళిలో 19,782 మెట్రిక్‌ టన్నులు, నందిగాంలో 19,733 మెట్రిక్‌ టన్నులు, కొత్తూరులో 19,110 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలుకు లక్ష్యం పెట్టుకోలేదంటూ అధికారులు చెప్తున్నా, కేంద్రాలకు నిర్దేశించిన మేరకే కొంటున్నారు. మిల్లులకు ఇచ్చిన ధాన్యం మేరకు మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటున్నారు. బ్యాంకు గ్యారంటీలు పూర్తి కావడంతో ఆర్‌బికె సిబ్బంది తర్వాత వచ్చిన వాటిని వెనక్కి పంపిస్తున్నారు.ధాన్యం తరలింపులో తలెత్తిన సాంకేతిక సమస్యలతో రైతులకు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదీ రైతులకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. అమ్మిన ధాన్యాన్ని రైతులు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు తరలించడంలో నానాపాట్లు పడుతున్నారు. ఆన్‌లైన్‌ ఇబ్బందులు, అన్‌లోడింగ్‌ సమస్యలతో రైతులు దళారుల వైపే మొగ్గు చూపుతున్నారు. రాజకీయ పలుకుబడి, పైరవీలు చేసే మిల్లర్లే అధిక పరిమాణంలో ధాన్యం తీసుకుంటున్నారని గుర్తించిన ప్రభుత్వం, ఈసారి అందరికీ ఆన్‌లైన్‌ ద్వారా ధాన్యం కేటాయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం చిన్న మిల్లర్లకు నష్టం మాట పక్కన పెడితే ఇప్పుడు రైతులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. చిన్న మిల్లుల సామర్థ్యం తక్కువగా ఉండడంతో పాటు తగినంత స్థలం లేకపోవడంతో అన్‌లోడింగ్‌కు రెండు, మూడు రోజుల పాటు మిల్లుల వద్దే ధాన్యం బస్తాలను తీసుకెళ్లిన ట్రాక్టర్లు ఉండిపోతున్నాయి.

 

➡️