నేడు బోసిపోయిన జిటి రోడ్డు
శ్రీకాకుళం అర్బన్ :
సంక్రాంతి పర్వదినాలకు పదిహేను రోజుల ముందు నుంచి నగరంలోని వ్యాపార సంస్థలు, వ్యాపార కూడళ్లు రద్దీగా కనిపించారు. గడచిన నాలుగు రోజులుగా ప్రధాన రహదారుల్లోని వస్త్ర దుకాణాలు, మార్కెట్ కిక్కిరిసిపోవడంతో రాక పోకలు సాగించలేనంత రద్దీగా కనిపించాయి. కొత్త దుస్తుల కొనుగోలకు నగర వాసులతో పాటు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారితో కిటకిట లాడాయి. వాహనాల పార్కింగ్కు నగరంలో అనువైన స్థలం లేకపోవడంతో ట్రాఫిక్నకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో సెంటర్ పార్కింగ్ ఏర్పాటు చేసినా అక్కడా పార్కింగ్ స్థలానికి మించి వాహనాలు పెట్టడంతో నడిచి వెళ్లే వారు సైతం ఇబ్బందిపడ్డారు. ఇదంతా సంక్రాంతి రోజువరకు గడచిన పది రోజుల పాటు సాగింది. కనుమ రోజైన మంగళ వారం అందుకు భిన్నంగా కనిపించింది. నగరంలో జనం రద్దీ తగ్గింది. వస్త్ర దుకాణాలు ఖాళీగా కనిపించాయి. మార్కెట్ సైతం ఖాళీగా ఉండడంతో రోడ్లపై జనం కరవయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. సాధారణ రోజుల్లో ఉండే రద్దీ కూడా లేకుండాపోయింది.