ఆందోళన చేస్తున్న కార్మికులు
ప్రజాశక్తి- టెక్కలి రూరల్
మండలంలోని రావివలసలో అల్లాయిస్ పరిశ్రమ కార్మికులు బుధవారం ఆందోళన చేపట్టారు. కొద్ది నెలలుగా పరిశ్రమ లాకౌట్ ఉంది. దీంతో పరిశ్రమకు సంబంధించిన విలువైన సామగ్రిని యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న కార్మికులు అడ్డుకున్నారు. చాలా ఏళ్లుగా పరిశ్రమలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు, రోజువారీ కూలీలకు రావాల్సిన బకాయిలతో పాటు ఇతర అంశాలపై పరిశ్రమ యాజమాన్యం అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ గేటు వద్ద బైటాయించి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి సిఐ సూర్యచంద్రమౌళి, ఎస్ఐలు ఎల్.రామకృష్ణ, కె.రమేష్బాబు, తమ సిబ్బందితో పరిశ్రమ వద్దకు చేరుకుని కార్మికులకు నచ్చజెప్పారు. తమకు అన్యాయం జరుగుతుందని కార్మికులు పోలీసులను ప్రశ్నిస్తూ… వాపోయారు. తమకు బకాయిలు చెల్లించకుండా పరిశ్రమ యాజమాన్యం దోబూచులాడుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పోలీసుల సమక్షంలో పరిశ్రమలో నుంచి వాహనాలను బయటకు తరలించారు.