కొత్తూరు : ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజనులు
ప్రజాశక్తి- కొత్తూరు
ఆదివాసీ నిరుద్యోగు లను ఆదుకోవడానికి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మండలంలోని గొట్టిపల్లిలో మన్యం బంద్లో భాగంగా ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుకున్న గిరిజనుల అందరికీ ఉద్యోగులు ఇవ్వాలన్నారు. ఇటీవల విడుదల చేసిన డిఎస్పి నోటిఫికేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంతో ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఐటిడిఎ ఏర్పాటు చేయాలన్నారు. సాగులో ఉన్న ఆదివాసుల భూములకు పోడు పట్టాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లోకి చేర్చాలన్నారు. మాతృభాష వాలంటీర్లను మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కొనసాగించి జీతాలు చెల్లించాలన్నారు. వాలంటీర్లను రెగ్యులర్ చేసి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆరిక శివ, ఆరిక సింహాచలం, గేదెల ధర్మారావు, గేదెల అనిల్కుమార్, నిమ్మక, పార్వతి, ఆరిక సావిత్రమ్మ, నిమ్మక రామారావు పాల్గొన్నారు. మందస : మన్యం బంద్లో భాగంగా మందసలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు సవర గురునాథ్, సవర ధర్మారావు మాట్లాడుతూ ప్రస్తుతం గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ వేసి నియామకాలు చేపట్టాలన్నారు. జిఒ నంబరు 3 పునరుద్ధరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని, ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లను కొనసాగించాలన్నారు. ఏజెన్సీల్లో వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీలకే కేటాయించాలన్నారు. మండలంలోని గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఎం.ధర్మారావు, కార్మిక సంఘాల నాయకులు, పి. దేవేంద్ర, ఎస్.ఫాల్గుణరావు, ఎస్.భావన్న, ఎన్.భాస్కరరావు, ఎ.కృష్ణారావు, పి.అప్పలస్వామి పాల్గొన్నారు.