శంకుస్థాపన చేస్తున్న నాయకులు
ప్రజాశక్తి- కొత్తూరు
మండలంలోని మెట్టూరు బిట్-3లో చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం, వంశధార రైతు ఉత్పత్తిదారుల సంఘం, నాబార్డు సహకారంతో సంత ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేప్స్ డైరెక్టర్ పడాల లీషా, నాబార్డు అభివృద్ధి అధికారి కె.వరప్రసాద్కుమార్ తెలిపారు. ఈ మేరకు సంత ఏర్పాటు పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకోవడానికి, దళారీల బారిన పడకుండా రైతు సుస్థిరత కోసం రూరల్ హాట్ పేరుతో సంత ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మెట్టూరు బిట్-3తో పాటు చుట్టుపక్కల ఆరు కిలోమీటర్ పరిధి రైతులు, గిరిజనులు పండించే పంటలు నేరుగా మార్కెటింగ్ చేసుకోవడానికి, రైతులు ఉత్పత్తులు నిలవ చేసుకోవడానికి, మద్దతు ధర వచ్చేంత వరకు ఉంచి అమ్ముకోవడానికి, వ్యాపార సముదాయం, గోడౌన్ నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. హార్టికల్చర్ శాఖ ద్వారా కోల్డ్ స్టోరేజ్, కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మెట్టూరు బిట్-3ని దేశంలో ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. వంశధార ఎఫ్పిఒ ద్వారా ఈ ఏడాదీ ఖరీఫ్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నాణ్యమైనవి, సరైన సమ యంలో అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కోయిలపు శ్రీనివాసరావు, వైస్ సర్పంచ్ వావిలాపల్లి అనురాధ, మన్యదీపిక సిఇఒ కైలాష్ సాహు, సిఇఒలు డి.సుజాత, సవర తులసి, కో-ఆర్డినేటర్ తౌడు, ధర్మరాజు పాల్గొన్నారు.