హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న శ్రీవారి సేవకులు
61 గ్రాముల బంగారం, 1.600 కిలోల వెండి లభ్యం
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఉన్న హుండీల ఆదాయాన్ని ఆలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో గురువారం లెక్కించారు. గత నెల 27 నుంచి 31 రోజుల పాటు హుండీ ద్వారా రూ.43,09,655 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఇఒ చంద్రశేఖర్ తెలిపారు. నోట్లు రూపంలో రూ.41,45,262 ఆదాయం రాగా, చిల్లర నాణేలు రూ.1,64,393 ఆదాయం సమకూరినట్టు వివరించారు. వీటితో పాటు బంగారం 61 గ్రాములు, వెండి 1.600 కిలోలు, విదేశీ మారకద్రవ్యం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 8 డాలర్లు వచ్చాయని చెప్పారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ సహాయక కమిషనర్ ప్రసాద్ పట్నాయక్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మలు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు ద్వారాపు అనురాధ, కోటేశ్వరరావు, లుకలాపు గోవిందరావు, జలగడుగుల శ్రీనివాస్, సినియర్ అసిస్టెంట్ జి.వి.బి.ఎస్.రవికుమార్ పాల్గొన్నారు.