సమావేశంలో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి నవీన్
* జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్
ప్రజాశక్తి – ఆమదాలవలస
సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లలో చైతన్యం పెంచాలని జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎం.నవీన్ అధికారులకు సూచించారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో ఆమదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాలకు చెందిన బిఎల్ఒలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో అధికారులు ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. అటువంటి ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి ఆయా ప్రాంతాల్లో సక్రమంగా ఓటింగ్ విధానం నిర్వహించడానికి చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, చేపట్టాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలించారు. ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల డిటి మురళీధర్ నాయక్, తహశీల్దార్లు రమేష్బాబు, వేణుగోపాల్, అంబేద్కర్, సెక్టార్ అధికారులు, బిఎల్ఒలు తదితరులు పాల్గొన్నారు.