కుట్ర చేస్తున్న మోడీ

Mar 11,2024 13:00 #srikakulam

ప్రజాశక్తి-శ్రీకాకుళం : ఎన్నికల బాండ్లు వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి డిమాండ్ చేసారు. ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను వెల్లడించకుండా కుట్ర చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎస్బీఐ వైఖరిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్యాంచి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, గత నాలుగేళ్ళలో అమ్మినబాండ్లు, వాటిని కొన్నవారి సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా బ్యాంక్ అందించాలనీ, ఈసీ ఆ వివరాలను మార్చి 13లోగా బహిర్గతపరచాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించిందని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్.బి.ఐ విఫలమైంది. ఈ సమాచారాన్ని ఇవ్వడానికి ఎస్బిఐకి ఇచ్చిన మూడు వారాల గడువు ముగిసింది. ఆ వివరాలను వెల్లడించడానికి బదులు ఎస్బిఐ గడువు ముగుస్తున్న సమయంలో మరో 116 రోజులు అదనపు గడువు కావాలని కోర్టును ఆశ్రయించందని, అంటే ఎన్నికలు ముగిసేవరకు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించకుండా వుండేందుకు పన్నాగం పన్నినట్టు స్పష్టమవుతోందని విమర్శించారు. తన కార్యకలాపాలన్నింటినీ డిజిటలైజ్ చేసిన ఎస్బీఐ ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను కొద్ది రోజుల్లో పొందుపరిచి ఇవ్వలేక పోయిందంటే నమ్మశక్యంగా లేదని అన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒత్తిళ్ళ కారణంగానే ఎస్బిఐ సహించరాని ఈ వైఖరి తీసుకుందని, ఇప్పటికైనా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలన్నీ ఎస్బిఐ అందచేసేలా సుప్రీం కోర్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు జి సింహాచలం, సి హెచ్ అమ్మా న్నాయుడు, జి ఈశ్వరమ్మ, గోవర్ధన్ రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

➡️