పోలీసు అధికారులకు సూచనలు చేస్త్ను గంగాధరం
ప్రజాశక్తి – ఇచ్ఛాపురం
నామినేషన్ల దాఖలుకు నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని బందోబస్తు ఇన్ఛార్జి, ఎస్ఇబి జెడి గంగాధరం తెలిపారు. బస్టాండ్ వద్ద కట్ ఆఫ్ పాయింట్ను గురువారం పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నామినేషన్ల సమయంలో పోలీస్ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం గేటు నుంచి వంద మీటర్ల దూరం వరకు కట్ ఆఫ్ పాయింట్ ఉండాలని తెలిపారు. కేవలం అభ్యర్థితో పాటు మరో నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే తహశీల్దార్ గేటు వరకు అనుమతించాలన్నారు. వేరెవరికీ లోపలకు అనుమతించకూడదని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కేవలం మూడు కార్లు, ఐదుగురిని మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. ర్యాలీలు, జనాలను వంద మీటర్ల దూరంలో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, సోంపేట సిఐలు ఇమ్మాన్యుయేల్ రాజు, మల్లేశ్వరరావు, ఇచ్ఛాపురం టౌన్, రూరల్, కవిటి ఎస్ఐలు సత్యనారాయణ, లక్ష్మణరావు, రాము సిబ్బంది పాల్గొన్నారు.