మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్
- వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం రూరల్
నైరుతి రుతుపవనాలు ఈనెలాఖరుకు రాష్ట్రంలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు రైతాంగం సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ అన్నారు. మండలంలోని వెంకటాపురంలో నైర వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యాన ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహించే ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 38 వేల మెట్రిక్ టన్నులు వరి విత్తనాలు, 22 వేల మెట్రిక్ టన్నుల యూరియా, ఇతర క్రిమి సంహారక మందులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రస్తుతం పది వేల మెట్రిక్ టన్నుల వరి విత్తనాలు జిల్లాకు వచ్చాయని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులను విక్రయిస్తామన్నారు. రైతాంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలురకాలుగా ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. వీటిని సక్రమంగా వినియోగించుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. నైర వ్యవసాయ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ గేదెల జోగినాయుడు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మ పథక సంచాలకులు ఎ.రామచంద్రరావు, ఎచ్చెర్ల యూనియన్ బ్యాంకు డైరెక్టర్ శ్రీనివాసరావు, నైర కళాశాల అగ్రానమీ ఆచార్యులు ఉపేంద్రరావు, పెంకి జ్యోతిబసు, నైర వ్యవసాయ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.