మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ నవీన్
- మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలి
- జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
జూన్ నాలుగో తేదీన నిర్వహించే కౌంటింగ్ కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఒక్కొక్క హాల్లో అబ్జర్వర్కి ఒక సహాయకులు ఉండాలన్నారు. లేబర్ అరేంజ్మెంట్కు సంబంధించి డ్వామా పీడీ తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. శిక్షణా తరగతులకు సంబంధించి మొదటి విడత ర్యాండమైజేషన్ ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. తరగతుల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ నిర్దేశించిన సూచనలను అనుసరించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై పూర్తి శిక్షణ అందజేయాలని, 23వ తేదీన ఆర్ఒలకు, ఎఆర్ఒలకు శిక్షణా తరగతులు జరుగనున్నాయన్నారు. లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మూడంచెల శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు.మీడియా సెంటర్ ఏర్పాట్లపై జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారితో సమీక్షించి, చేపట్టాల్సిన పనులపై సూచనలు చేశారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం తదితర ఏర్పాట్లపై డిప్యూటీ సిఇఒతో సమీక్షించి సమీక్షించారు. కౌంటింగ్ హాల్ ఏర్పాట్లపై ఆరా తీసి కౌంటింగ్ హాల్ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం సూచనలు తప్పక పాటించాలని సూచించారు. సిసిటివి ఏర్పాట్లు, వీడియోగ్రాఫర్స్ ఏర్పాట్లపై సూచనలు అందజేశారు. అనంతరం సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించి మొబైల్ కలెక్షన్ కౌంటర్, మెటల్ డిటెక్టర్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏర్పాటుపై పోలీసులకు సూచనలు అందజేశారు. నిరంతరం విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని, ఆటో ఛార్జర్స్, లైటింగ్ ఏర్పాట్లపై ట్రాన్స్కో ఎస్ఇకి పలు సూచనలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు ఏర్పాట్లపై సుడా విసికి, కౌంటింగ్ కేంద్రంలో కావాల్సిన స్టేషనరీ ఏర్పాట్లపై జెడ్పి సిఇఒకి తగు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, జెడ్పి సిఇఒ వెంకటేశ్వరరావు, సుడా విసి ఓబులేసు, సమగ్ర శిక్ష అభియాన్ పిఒ జయప్రకాశ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ఎన్ఐసి సిరాజ్, కిరణ్, డిసిఒ బాలాజీ నాయక్, ట్రాన్స్కో ఎస్ఇ ఎన్.కృష్ణమూర్తి, డిటిసి చంద్రశేఖర్ రెడ్డి, డ్వామా పీడీ చిట్టి రాజు, జెడ్పి డిప్యూటీ సిఇఒ ఆర్.వెంకట్రామన్, ఆర్అండ్బి ఎస్ఇ జాన్ సుధాకర్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి సుధ, ఫైర్ ఆఫీసర్ మోహనరావు, ఎల్డిఎం సూర్యకిరణ్, ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, సివిల్ సప్లై డిఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.