అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో మాట్లాడుతున్న గొండు శంకర్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
రిమ్స్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ హామీనిచ్చారు. సోమవారం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన ఆయనను రిమ్స్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు కలిసి సమస్యలను వివరించారు. వేతనాలు సకాలంలో అందడం లేదని, ఇఎస్ఐ, పిఎఫ్ వంటి కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా భవిష్యత్కు భద్రత కరువైందన్నారు. తక్కువ జీతాలు పొందే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ పధకాలు వర్తించడం లేదని వివరించారు. ఎన్నికల్లో విజయం సాధించి కార్మికులు, ఉద్యోగుల పక్షాన నిలుస్తానని, ఎంపి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఓటు వేసి విజయాన్ని అందించాలని కోరారు. ఆయనతో పాటు టిడిపి నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నాగ భూషణం, గిరిజా శంకర్, మూకళ్ల సింహాద్రి నాయుడు, కె.వి. ఎస్.నాయుడు(బుజ్జి), భాస్కర్, రౌతు సంతోష్, పాల్గొన్నారు.