వీల్చైర్లను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ఈనెల 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వృద్ధులు, వికలాంగులు ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ ఛైర్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో గురువారం కలెక్టర్ అధ్యక్షతన నియోజకవర్గాల వారీగా పంపేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు 1700 వీల్ ఛైర్లు, కంటిచూపు తక్కువ ఉన్న వారికి మాగ్నిఫయింగ్ (భూతద్దాలు) 1700 వచ్చాయని తెలిపారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీటిని పంపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డిఆర్ఒ ఎం.గణపతిరావు, వికలాంగ సంక్షేమశాఖ సహాయ సంచాలకులు కవిత తదితరులు పాల్గొన్నారు.