ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని టిడిపి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం విజయనగరంలో డాక్టర్. పివిజి. రాజు కళ్యాణ మండపంలో కొప్పల వెలమ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన లాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన రిజిస్ట్రేషన్ ఒరిజినల్ పత్రాలు వారి పేరు మీద ఉంటాయన్నారు, మనకు కేవలం జిరాక్స్ మాత్రమే ఇస్తారన్నారు, దీనివలన మీరు కోర్టుకు వెళ్లినా హక్కు ఉండేదన్నారు, 1బి రికార్డులు కూడా వీరు తారుమారు చేస్తున్నారన్నారు.వైసిపి హయాంలో విపరీతంగా ధరలు, పన్నులు పెరిగాయని అన్నారు. నియోజకవర్గం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్బాబు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు తదతరులు పాల్గొన్నారు.