కానరాని రాజకీయ అంశాల ప్రస్తావన
సిిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి
ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : ప్రస్తుత ఎన్నికల్లో ధన రాజకీయాలు అధికం కావడం దురదష్టకరమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం విపరీతంగా డబ్బులు పంచారని, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సిపిఐ మాత్రమే ఏడు కరపత్రాలను ప్రతి గుమ్మానికి అందజేసిందన్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ అంశాలు మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం దురదష్టకరమన్నారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని కేంద్రంలోని నరేంద్ర మోడీకీ, రాష్ట్రంలో జగన్కు అర్థమైందన్నారు. మోడీ ఓట్ల కోసం మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తుంటే జగన్ ప్రసంగాల్లో నిరాశా,ని స్పహలు కనిపిస్తున్నాయని చెప్పారు.పదేళ్లపాటు ప్రధాని పీఠంపై కూర్చున్న నరేంద్ర మోడీ పదేళ్ల కాలంలో చేసిన పనుల గురించి చెప్పకుండా, మత పరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారన్నారు. ఉపాధి పథకానికి నిధులు కేటాయింపుల్లేకపోవడంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయన్నారు. వంటగ్యాస్ ధరను మూడింతలకు దాదాపు రూ.1200 పెంచి, ఎన్నికలకు ముందు ఓట్ల లబ్ధికోసం స్వల్పంగా తగ్గించారన్నారు. బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్పై రెజ్లర్లు లైంగిక వేధింపులపై కనీస చర్యల్లేవని విమర్శించారు. కేజ్రీవాల్కు బెయిల్ రావడం మోడీకి చెంప పెట్టని అన్నారు.రాష్ట్రంలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు, చెత్తపై పన్ను విధింపు, నిత్యావసరాల ధరలు మోత, ఆర్టిసి ఛార్జీల వాతతో ప్రజలను సిఎం జగన్ మోయలేని భారాలు మోపారన్నారు. మోత ఏడుసార్లు పెంచి,చెత్త పన్ను విధించి,ఆస్తి పన్ను పెంచి భారీగా భారాలు మోపారన్నారు. రాష్ట్రంలోని తెలుగుదేశం, బిజెపి, జనసేన అపవిత్ర కలయిక అని విమర్శించారు. సిపిఐ,కాంగ్రెస్,సిపిఎం, అమ్ ఆద్మీ, సమాజ్ వాది పార్టీ, ఎన్సిపి, శివసేన, డిఎంకె, ఆర్జెడి తదితర పార్టీల ఇండియా బ్లాకుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, పశ్చిమ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తిలి విమల, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె అచ్యుతరావు పాల్గొన్నారు.