ఎఫ్ఎంఎస్ కార్మికుల విజయంకొత్త నిబంధనలు రద్దు చేస్తూ బోర్డు నిర్ణయంఆందోళన విరమణప్రజాశక్తి -తిరుపతి సిటీ టిటిడి ఎఫ్ఎంఎస్ కార్మికుల పోరాటానికి యాజమాన్యం దిగివచ్చింది. హెల్త్ టెండర్ల కొత్త నిబంధనలను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో కార్మికులు ఆందోళనను విరమించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఎఫ్ఎంఎస్ కార్మికులు రెండు రోజులుగా టిటిడి పరిపాలనా భవనం వద్ద ఆందోళన చేస్తున్న విషయం విదితమే. సోమవారం జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో హెల్త్ టెండర్ల కొత్త నిబంధనలను ఉపసంహరిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. బోర్డు నిర్ణయాన్ని స్వాగతిస్తూ సోమవారం సాయంత్రం కార్మికులు ఆందోళనను విరమించినట్లు యూనియన్ గౌరవాధ్యక్షులు టి.సుబ్రమణ్యం వెల్లడించారు. సోమవారం ఉదయం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్శింగరావు వీరి శిబిరం వద్దకు విచ్చేసి సంఘీభావం ప్రకటించారు.41 ఏళ్లు పైబడిన వారు వద్దని, 30శాతం మహిళలు, 70 శాతం పురుషులు ఉండాలని, సూపర్వైజర్లకు శానిటరీ సర్టిఫికేట్ ఉండాలని తాజా టెండర్లలో టిటిడి నిబంధనలు సరికాదన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, టిటిడి ఉద్యోగ సంఘం మాజీ నాయకులు మునిరాజా, నాయకులు వేణుగోపాల్, బుజ్జమ్మ, ఎఫ్ఎంఎస్ సంఘం నాయకులు త్యాగ, రఘు, రవి,పార్థసారథి పాల్గొన్నారు.