ప్రసూతి మరణాలు జరగరాదు : కలెక్టర్ప్రజాశక్తి – తిరుపతి టౌన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసూతి మరణాలు జరగకుండా చూడాలని, తప్పనిసరిగా డెలివరీ ప్రోటోకాల్ పాటించాలని, ప్రసూతి మరణాలకు బాధ్యులుగా తేలితే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రసూతి మరణాలపై సంబంధిత కుటుంబ సభ్యులతో, చికిత్స అందించిన డాక్టర్లు, అంగన్వాడి, ఎఎన్ఎం, ఆశాలతో ఆడిట్ నిర్వహణ జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నపాటి పొరబాటుకు తావు లేకుండా ప్రసవ సమయంలో నియమావళి మేరకు వైద్యపరీక్షలు జరిపి తల్లీబిడ్డ క్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాల్యవివాహాలు జరిపే వారిపై చర్యలు ఉంటాయాన్నరు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి, రుయా సూపరింటెంటెండ్ రవిప్రభు, డిసిహెచ్ఎస్ ఆనందరెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి జయలక్ష్మి, డిపిఎంఓ శ్రీనివాసరావు, డిఎంహెచ్ఒ అరుణ సులోచన, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ పార్థసారథి, జిల్లా సర్వైవలేస్స్ అధికారిణి తేజేశ్వరి పాల్గొన్నారు