మరింత గొప్పగా ధర్మ ప్రచారంధార్మిక సదస్సులో భూమన కరుణాకర్రెడ్డిప్రజాశక్తి – తిరుమలమఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. తాను తొలిసారి ఛైర్మన్ గా ఉన్న సమయంలో రెండు సార్లు ధార్మిక సదస్సులు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను స్వీకరించి దళిత గోవిందం, మత్స్య గోవిందం, గిరిజన గోవిందం లాంటి కార్యక్రమాల ద్వారా భగవంతుడిని భక్తుల చెంతకు తీసుకెళ్లామని చెప్పారు. స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని గుర్తు చేశారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చిత్త శుద్ధితో ప్రజలకు చేరువ చేస్తున్న టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి జరుగుతోందని స్వామీజీలకు విన్నవించారు. తమ వైపు నుంచి ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే తగిన సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సదస్సు రెండో సెషన్లో బ్రహ్మంగారి మఠం విరజానంద స్వామి మాట్లాడుతూ భజనల్లో పిల్లల్ని భాగస్వాములను చేయాలన్నారు. ఏర్పేడు వ్యాసాశ్రమం పరిపూర్ణానందస్వామి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లోనూ ధర్మ ప్రచారం జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామి, హరితీర్థానంద స్వామి పాల్గొన్నారు. జెఇఒలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి రాణి సదాశివమూర్తి, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ విభీషణశర్మ పాల్గొన్నారు.
![మరింత గొప్పగా ధర్మ ప్రచారంధార్మిక సదస్సులో భూమన కరుణాకర్రెడ్డి](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Untitled-16666666666666666666.jpg)