లా కాలేజీలపై బీసీఐ కొరఢాఎఇఆర్తో పాటు, షిర్డీసాయి లో ప్రవేశాలు రద్దు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆంక్షలుప్రజాశక్తి – తిరుపతి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న లా కాలేజీలపై బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) కొరఢా జులిపించింది. తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలం, అంజిమేడు వద్ద ఏర్పాటు అయిన అగరాల ఈశ్వర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ లా తోపాటు, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని గవరపాలెంలో ఉన్న శ్రీ షిరిడిసాయి విద్యాపరిషత్ ఆధ్వర్యంలోని శ్రీ షిరిడిసాయి లా కాలేజీ లో ప్రవేశాలను రద్దు చేసింది.ఈ మేరకు అధికారక ప్రకటన విడుదల చేసింది. ఏపీలోని లా కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాలకు సంబంధించి జూన్ 9న ఏపీ లాసెట్/ పీజీఎల్సెట్ 2024 ప్రవేశ పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించింది. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 10న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి జూన్ 11, 12 వ తేదీల్లో ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించింది. ఈ ప్రక్రియ పూర్తవడంతో ఫలితాల వెల్లడికి ఉన్నతవిద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సందర్భంలో అగరాల ఈశ్వర్ రెడ్డి కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహణ, కాపీయింగ్ విషయంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొదట్లో సెమిస్టర్ పరీక్షల నిర్వహణలోనూ కాపీయింగ్ కు పాల్పడడంతో స్వయంగా తిరుపతి జిల్లా కలెక్టర్ స్పందించారు. రేణిగుంట తహసీల్దార్ ను ఆకస్మిక తనిఖీలకు పంపి రిపోర్టును బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు పంపారు. ఇలాగే వైజాగ్ లోని షిరిడి సాయి లా కాలేజ్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్లో ఈ రెండు కళాశాల పైన బిసిఐ నిషేధం విధించడం గమనార్హం. అలాగే దేశవ్యాప్తంగా మొత్తం 7 కళాశాలల్లో ఈ ఏడాది (2024-25) ప్రవేశాలను రద్దుచేయగా … నాలుగు యూపీ కాలేజీలే కావడం గమనార్హం.