సరకా ల్యాబరేటరీస్‌లో రియాక్టర్‌ పేలుడు

Jun 29,2024 21:50 #blast, #factory, #srikakulam

ప్రజాశక్తి- రణస్థలం రూరల్‌ (శ్రీకాకుళం జిల్లా) :శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిబీమవరం సమీపంలోని సరకా ల్యాబరేటరీస్‌ రసాయన పరిశ్రమలో శనివారం భారీ పేలుడు సంభవించింది. కేమ్‌ ప్రొడక్షన్‌ బ్లాక్‌ాబిలో సార్ట్‌సర్కుట్‌ వల్ల రియాక్టరు ఒక్కసారిగా పేలింది. మధ్యాహ్నం కార్మికుల భోజన విరామ సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. కార్మికులు అప్రమత్తమై ప్రమాదం జరిగిన బ్లాక్‌ వద్దకు చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న డిఎఫ్‌ఒ మోహనరావు, రణస్థలం అగ్నిమాపక అధికారి అశోక్‌ ఆధ్వర్యాన సిబ్బంది, అరబిందో, డాక్టర్‌ రెడ్డీస్‌ అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఆ ప్రాంతమంతా పెద్దఎత్తున పొగకమ్ముకోవడంతో చుట్టు పక్కల ప్రజలు భయాందోళన గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఇఆర్‌) సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద వివరాలను అక్కడి అధికారులకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తక్షణ చర్యలు తీసుకోవాలని, మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

 

➡️