రెండో రోజూ పోస్టల్ బ్యాలెట్ప్రజాశక్తి – తిరుపతి టౌన్, చిత్తూరు అర్బన్, సత్యవేడు తిరుపతి జిల్లాలో సోమవారం రెండో రోజూ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో ప్రశాంతంగా జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోనూ, శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం హ్యుమానిటీస్ బ్లాక్ -1నందు, తిరుపతి ఎస్వీ క్యాంపస్ బ్యాలెట్ పాఠశాల బాలాజీ కాలనీలో ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. తాగునీరు, షేడ్, ఫ్యాన్, చైర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉద్యోగులు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించగా.. రెండవ రోజైన సోమవారం అత్యవసర సేవలు అందించు పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు మీడియా పర్సన్ లు, వీడియోగ్రాఫర్ లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. చిత్తూరు జిల్లా కలెక్టరెట్ నందు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం నందు ఇతర జిల్లాలలో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకున్న వారు తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియను సోమవారం చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. షన్మోహన్ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యంను వినియోగించు కునేందుకు వచ్చే వారికి అవసరమైన త్రాగునీరు, మజ్జిగ, ఓ ఆర్ ఎస్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. త్వరగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ధవ పత్రాలను పరిశీలించి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా సహకరించాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. సత్యవేడులో పోటెత్తిన ఉద్యోగులుసత్యవేడు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు సంబంధించి ఇక 160 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంది. మొత్తం 1366 ఓటర్లకు గాను తొలిరోజు 799 ఓట్లు పోలింగ్ అవగా, రెండవ రోజైన సోమవారం 407 ఓట్లు పోలయ్యాయి. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా, సునామీలా దూసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉద్యోగులు.
![రెండో రోజూ పోస్టల్ బ్యాలెట్](https://prajasakti.com/wp-content/uploads/2024/05/888888888888888-1.jpg)