అనుమానంతో భార్యను నరికిన భర్తప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే విచక్షణారహితంగా కత్తితో నరికి గాయపడిన సంఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా యాదమరి మండలం బెంగళూరు- చెన్నై జాతీయ రహదారి ముత్తరపల్లి బస్టాప్ వద్ద 14వ తేదీ మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో జేసిబి మెకానిక్గా పనిచేస్తున్న చీలాపల్లికి చెందిన ఉమాపతి (35) తన భార్య స్వాతి (29)పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి నరికి అక్కడి నుంచి పరారయ్యాడు. కొన ఊపిరితో ఉన్న స్వాతిని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు చిత్తూరు జానకారపల్లిలో కాపురం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. యాదమరి ఎస్సై రామాంజనేయులు కేసు నమోదు చేసి నిందితుడు ఉమాపతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
![అనుమానంతో భార్యను నరికిన భర్త](https://prajasakti.com/wp-content/uploads/2024/05/666666666666666666.jpg)