ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : విద్యార్థి దశ నుంచే సామాజిక సేవలో పాలుపంచుకోవడం అలవర్చుకోవాలని ఆదోని డిఎస్పి శివ నారాయణ స్వామి పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదోనిలోని విశ్వనారాయణ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఎంసెట్ కోచింగ్ కేంద్రాన్ని ఆదోని డిఎస్పి శివ నారాయణస్వామి గురువారం ప్రారంభించారు. ఎస్ఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిఎస్పి మాట్లాడారు. విద్యార్థులు వేలకు వేల ఫీజులు ఎంసెట్ కోచింగ్కు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఉచిత ఎంసెట్ కోచింగ్ నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. మాజీ డివైఎఫ్ఐ నాయకులు లక్ష్మన్న, లింగన్న మాట్లాడుతూ భవిష్యత్తులో మోడల్ ఎంసెట్ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల్లో ఉన్న భయాందోళన దూరం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఉచిత ఎంసెట్ కోచింగ్ను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భరత్ కుమార్, గౌస్, నాగరాజు, దినేష్ ,శశి,పవన్ పాల్గొన్నారు.