– ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మళ్లీ కలకలం రేగింది. కొద్ది రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్ ఢిల్లీలో అలజడి రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం పలు ఆసుపత్రులకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఢిల్లీలోని బురాయి, సంజరు గాంధీ ఆసుపత్రులు సహా పది హాస్పిటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే.. అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని చెప్పారు.
ఇటీవల 150కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలన్నింటికీ ఒకే ఐపి అడ్రస్ నుంచి మెయిల్స్ వచ్చాయి. చివరకు పోలీసుల తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.