ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జెఎన్యులో స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో లెఫ్ట్ ప్యానెల్ విజయం సాధించడంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన సోమవారం స్థానిక కోట జంక్షన్ వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహనరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి సాగిస్తున్న దుర్మార్గ విధానాలను ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో తిప్పికొడతారని, దానికి జెఎన్యు ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణని తెలిపారు. యూనివర్సిటీలో హింసాకాండకు పాల్పడుతున్న ఎబివిపి మతోన్మాద గూండాలపై ఎస్ఎఫ్ఐ నాయకత్వంలోని లెఫ్ట్ కూటమి ఎన్నో అడ్డంకులను ఛేదిస్తూ విజయం సాధించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు నిలువుటద్దమని తెలిపారు. ఈ సందర్భంగా బాణసంచా కాలుస్తూ రంగులను జల్లుకుంటూ విజయోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము, సిహెచ్ వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.సౌమ్య, జె.రవికుమార్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రాజు, పి రమేష్, తదితరులు పాల్గొన్నారు.