ప్రజాశక్తి-విశాఖ : గురువారం విజయవాడలో ఆశా వర్కర్లు భారీ ధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశాఖ సిఐటియు కార్యాలయం ముందు పోలీసు మోహరించారు. ఆశావర్కర్ల గౌరవాధ్యక్షురాలు మణికి కార్యాలయం దాటి వెళ్లకుండా నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్నాకు వెళ్లనివ్వకుండా పోలీసులు తమను అడ్డగిస్తున్నారని తెలిపారు. ధర్నాకు వెళ్లనివ్వకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వున్నవారిని కూడా అరెస్టు చేయడం అమానుషమన్నారు. సాయంత్రం లోపల ఆశావర్కర్లు, వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు స్వాధీనం చేయాలని భయపెడుతున్నారని తెలిపారు. జగన్ పాలనలో
ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆగ్రహించారు. ఆశావర్కర్లకి కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లను కోవిడ్ సమయంలో గ్లోబల్ హెల్త్ వర్కర్స్ గా ఐక్య రాజ్య సమితి గుర్తించిందని పేర్కొన్నారు. కానీ జగన్ ప్రభుత్వం కోవిడ్ సమయంలో పని చేసినందుకు ఆశావర్కర్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. ఐద్వా నాయకురాలు పద్మ మాట్లాడుతూ… ఆశావర్కర్లకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకూ అమలు చేయలేదని తెలిపారు. తమ సమస్యలు పట్టనట్లు వ్యవహరించడమే కాకుండా అరెస్టుకు చేయడం దుర్మార్గమన్నారు. మహిళలని చూడకుండా నిర్ధాక్షణ్యంగా వ్యవహరిస్తున్నారని ద్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని హెచ్చరించారు.
![asha workers chalo vijayawada visakha](https://prajasakti.com/wp-content/uploads/2024/02/asha-workers-chalo-vijayawada-visakha.jpg)