కాంగ్రెస్‌ను గెలిపించండి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు గురువారం యర్రగొండపాలెం మండలంలోని యర్రగొండపాలెం, వై కొత్తపల్లి, మొగుళ్లపల్లి, మురారిపల్లి, కాశికుంటతండా, పుల్లలచెరువు మండలంలోని గారపెంట, పుల్లలచెరువు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లిల్లూ తిరుగుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశ పెట్టబోయే తొమ్మిది పథకాలు ప్రజలకు వివరించారు. నియోజకవర్గాన్ని ఇప్పటి దాకా పాలించిన టిడిపి, వైసీపీ నాయకులు అభివృద్ధి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. దేశానికి,డ రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో జతకట్టి తిరుగుతున్న అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని కోరారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేసే ఇండియా వేదిక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు. బిజెపి ప్రభుత్వం హయాంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు. ఆడబిడ్డగా వచ్చిన తనను ఆదరించి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వెంకటరెడ్డి, నాసరయ్య, సూరి, పుచ్చకాయల వెంకటేశ్వర్లు చౌదరి, విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️