ఉరవకొండలో వైసిపి రోడ్‌ షో

May 11,2024 14:15 #Road Show, #Uravakonda, #YCP

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : ఎన్నికల ప్రచారం చివరి రోజున ఉరవకొండ పట్టణంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం భారీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా జనం, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు దీంతో ఉరవకొండ పట్టణంలో ఇసుకేస్తే రాళ్లనంత జనంతో వైసీపీ జెండాలతో నిండిపోయింది. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్‌,పాతపేట, జైనబ్బి దర్గా, గాంధీ బజార్‌ మీదుగా కామన్నకట్ట, పదవ వార్డు తదితర ప్రాంతాల మీదుగా కొనసాగింది. ర్యాలీ మొత్తం వైస్సార్సీపీ కార్యకర్తల నఅత్యాలు జై జగన్‌ జై విశ్వన్న నినాదంతో దద్దరిల్లింది. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ ర్యాలీ ఉరవకొండ కొండపై ఈ సారి వైస్సార్సీపీ జెండా దగ్గరేయడం ఖాయమని చెప్పకనే చెప్పింది. ఈ ర్యాలీ సందర్భంగా ఉరవకొండ వైఎస్‌ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై .విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ విశ్వసనీయతకు సంక్షేమానికి పెద్దపీట వేసి అన్ని విధాలా ప్రజలకు అండగా ఉన్న వైయస్సార్‌ ప్రభుత్వంపై మరోసారి ప్రజలందరూ అభిమానాన్ని చాటుకొని ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సాధ్యం కానీ హామీలు అబద్ధపు మేనిఫెస్టో లతో నిత్యం ప్రజలను మోసం చేసే దగాకోరుల కూటమికి ఓటు వేసి మోసపోకుండా ప్రజలందరూ విజ్ఞతతో ఓటు వేయాలన్నారు. ఎన్నికల అప్పుడు మాత్రమే కనిపించే సీజనల్‌ పొలిటిషన్‌ పయ్యావుల కేశవ్‌ కు ఓటు వేస్తే తిరిగి మళ్లీ ఎన్నికల అప్పుడు మాత్రమే కనిపిస్తాడని అలాగే చంద్రబాబుకు ఓటు వేస్తే మాయమాటలతో మోసాలు చేసి వెన్నుపోట్లు పొడిచి ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలన్నీ అడ్రస్‌ లేకుండా చేస్తాడని కాబట్టి ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగేలా జగన్మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్సీపీ ఫ్యాన్‌ గుర్తుకే అత్యంత విలువైన మీ ఓటును వేసి మరోసారి వైసీపీ జెండా ఎగరేయడానికి ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి నేనున్నాను నేను విన్నాను అని చెప్పిన మాట ఎంత నిజమైనదో ప్రజలు కూడా కూటమి కుట్రలు బద్దలు కొట్టడానికి మేమున్నాము మేము విన్నాము అండగా ఉండి వైస్సార్సీపీ జెండా మేము ఎగరేస్తామంటూ ఉరకలు తొక్కుతున్న ఉత్సాహానికి ఈ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలే నిదర్శనమని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మరో రెండు రోజుల్లో జరగబోయే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో నీతికి.. న్యాయానికి.. విశ్వసనీయతకు.. సంక్షేమానికి పెద్దపీట వేసే జగన్మోహన్‌ రెడ్డికి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విశ్వేశ్వరరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నేతలు, శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

➡️