హమాస్ సాయుధుల ఏరివేత అంటూ ప్రారంభించిన దాడుల్లో ఇరవై రెండు వేలకు పైగా సామాన్య పాలస్తీనియన్లు మరణించటం తప్ప జరిగిందేమీ లేదు. కొన్ని నెలల పాటు దాడులు కొనసాగిస్తామని చెప్పటం గాజాలో విఫలమైనట్లు అంగీకరించటమే. అందువల్లనే ఉగ్రవాద చర్యల ద్వారా హత్యలకు తెరలేపి రెచ్చగొట్టేందుకు పూనుకున్నట్లు స్పష్టమైంది. బుధవారం నాడు ఇరాన్లో పేలుళ్లతో 103 మందిని చంపటం, 211 మందిని గాయపర్చటం, అంతకు ముందు లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలో హమాస్ సీనియర్ నేత సాలేఅల్ అరౌరీని చంపటం వాటిలో భాగమే.
పశ్చిమాసియాలో గత రెండు మూడు రోజుల్లో జరిగిన పరిణామాల పర్యవసానాల గురించి ఆందోళన కలుగుతోంది. గాజాలో ఇజ్రాయిల్ ప్రారంభించిన జాతి హననం మూడవ నెలలో ప్రవేశిస్తున్నది. హమాస్ సాయుధుల ఏరివేత అంటూ ప్రారంభించిన దాడుల్లో ఇరవై రెండు వేలకు పైగా సామాన్య పాలస్తీనియన్లు మరణించటం తప్ప జరిగిందేమీ లేదు. కొన్ని నెలల పాటు దాడులు కొనసాగిస్తామని చెప్పటం గాజాలో విఫలమైనట్లు అంగీకరించటమే. అందువల్లనే ఉగ్రవాద చర్యల ద్వారా హత్యలకు తెరలేపి రెచ్చగొట్టేందుకు పూనుకున్నట్లు స్పష్టమైంది. బుధవారం నాడు ఇరాన్లో పేలుళ్లతో 103 మందిని చంపటం, 211 మందిని గాయపర్చటం, అంతకు ముందు లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలో హమాస్ సీనియర్ నేత సాలే అల్ అరౌరీని చంపటం వాటిలో భాగమే. గాజా నుంచి మిలిటరీని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించి ప్రపంచ దృష్టిని మళ్లించి అక్కడ దాడుల తీవ్రతను పెంచటం, ఉగ్రవాద చర్యలకు పాల్పడటం అమెరికా, ఇజ్రాయిల్ వాటి మిత్రదేశాల పథకం తప్ప మరొకటి కాదు. దీనికి ప్రతీకార చర్యలు జరిగితే ఆ పేరుతో మంటను మరింత రాజేయటం, మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధాన్ని ప్రారంభించేందుకే ఇదంతా అన్నది స్పష్టం. వివిధ విశ్లేషణల పూర్వరంగంలో ఇవి ఎటు దారితీసేదీ అప్పుడే చెప్పలేము.
2020 జనవరి మూడున బాగ్దాద్ పర్యటనలో ఉన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసిం సులేమానిని డ్రోన్ దాడితో అమెరికన్లు హత్యచేశారు. నాలుగవ వర్ధంతి సందర్భంగా బుధవారంనాడు కెర్మాన్ పట్టణంలోని సులేమాని సమాధి సమీపంలో రెండు బాంబు పేలుళ్లు జరిపి అనేక మందిని బలిగొన్నారు. ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలకు పోటీగా ఇరాన్ నౌక లంగరు వేయటంతో ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందన్నది స్పష్టం. బాధ్యత తమదే అని ఇంతవరకు ఏ సంస్థా ప్రకటించనప్పటికీ అమెరికా, ఇజ్రాయిల్ హంతక దళాల పనే అన్నది వేరే చెప్పనవసరం లేదు. తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. మంగళవారం నాడు లెబనాన్ రాజధాని బీరుట్ శివారు పట్టణమైన ధివేలో హమాస్ అగ్రనేతలలో ఒకడైన అరౌరీ కార్యాలయాన్ని పేల్చివేసి హత్య చేశారు. మరుసటి రోజు ఇజ్రాయిల్ మొసాద్ (అమెరికా సిఐఏ వంటిది) అధిపతి డేవిడ్ బారెనె హమాస్ నేతలు ఎక్కడ ఉన్నా వారిని మట్టు పెడతామని బుధవారం నాడు ప్రకటించటానికి అర్ధం తామే అరౌరీని చంపేసినట్లు చెప్పటమే. అదే రోజు లెబనాన్ లోని హిజబుల్లా కేంద్రాలపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో తొమ్మిది మంది మరణించారు.
హమాస్ను అణచివేయలేకపోవటం, వారి దగ్గర బందీలుగా ఉన్న తమ వారిని విడిపించుకోలేకపోయామన్న అసహనం, జనంలో పెరుగుతున్న అసంతృప్తి, దిగజారుతున్న ఆర్థిక స్థితి యూదు దురహంకారులకు మింగుడు పడటం లేదు. అమెరికా ఆశించినట్లు ప్రాంతీయ యుద్ధాన్ని తీసుకురావటంలో కూడా విఫలమైనట్లు పరిగణిస్తున్నారు. ఇవన్నీ జో బైడెన్ ఎన్నికల మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంచనా. అమెరికా రూపొందించిన పథకంలో భాగంగా మూడు నెలల కాలంలో ఒకటి, రెండవ దశలను అమలు జరిపిన ఇజ్రాయిల్ ఇప్పుడు మూడవ దశకు తీసుకుపోయేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే తమ మిలిటరీని ఉపసంహరిస్తున్న ట్లు ప్రకటించటం అంటే అతి పెద్ద దాడికి పూనుకోనున్నట్లు లేదా లెబనాన్ మీద దాడులకు దిగుతామని సంకేతం పంపటంగాను, దాన్లో భాగంగానే అరౌరీ హత్య జరిగిందని కొందరి విశ్లేషణ. అయితే గాజా ఉత్తర ప్రాంతాన్ని ధ్వంసం చేసినప్పటికీ అక్కడ తమ మిలిటరీకి ముప్పు తొలగలేదని ఇజ్రాయిల్ భావిస్తున్నది. ప్రతి ఇంటిని, ప్రతి సొరంగాన్ని తనిఖీ చేయాలంటే సంవత్సరాలు పడుతుందని, అందువలన పరిమిత స్థాయిలో దీర్ఘకాలం పాటు దాడులను కొనసాగించేందుకు చూస్తున్నదని మరికొందరి భావన. దానిలో భాగంగా లెబనాన్ మీద దాడులను ప్రారంభించటం కూడా ఒకటని అంటున్నారు. లెబనాన్ హిజబుల్లా గతం కంటే మెరుగైన సమాచార వ్యవస్థ, ఆధునిక ఆయుధాలను, నైపుణ్యాలను సంపాదించుకొని ఇజ్రాయిల్ మీద దాడులకు సిద్ధం అవుతున్నదన్న వార్తలు కూడా ఉన్నాయి. ఆ సంస్థ మీద ఒత్తిడి పెంచి వెనక్కు తగ్గేట్లు చేయాలన్న ఎత్తుగడలో భాగంగా కూడా హమాస్ నేత అరౌరీని హత్య జరిగిందని కూడ ఒక కథనం. భిన్న విశ్లేషణలు ఎలా ఉన్నప్పటికీ గాజా నుంచి పూర్తిగా సేనల ఉపసంహరణ, మారణకాండను నిలిపివేసే అవకాశం లేదు. అమెరికా తన ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుంది. అది రాజకీయ నేతల లబ్ధి, కార్పొరేట్లకు కాసులు కురిపించటం ఏదైనా కావచ్చు.
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్