బిజెపి ఎత్తుల కసరత్తులు, దేశానికి విపత్తులు

BJP height exercises, disasters for the country telakapalli article

ప్రధాని మోడీ అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ట చేసి బిజెపి ఓటుబ్యాంకు అపారంగా పెంచారన్న ప్రచారం చూస్తున్నదే. అయితే పాలకపక్షం పాచికలు అంతటితో ఆగడం లేదు. మోడీ అసాధారణ మానవుడైనట్టు, అతీత శక్తులున్నట్టు ఇప్పుడు భజన మొదలైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆయన తన బిజెపి అగ్రనేతలతో పాటు ఎన్నికల కసరత్తు చేశారట. తర్వాత కాస్త కునుకుతీసి వెంటనే బెంగాల్‌కు విమానంలో బయలుదేరి వెళ్లారట. ఏదో దైవదత్తమైన శక్తి వుంటే తప్ప ఇలా చేయడం సాధ్యం కాదని బిజెపి వంతదారుగా వుండే నటి కంగనా రనౌత్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఆయన బయలుదేరుతున్న దృశ్యంపై ఇలాంటి వ్యాఖ్యతో ప్రభుత్వ వర్గాలు చేసిన పోస్టునే ఆమె పొందుపర్చారు. ”ప్రధానిని ఏదో దివ్యలోక శక్తి నడిపిస్తుండకపోతే ఈ మానవాతీత సమర్థతకు, పట్టుదలకు మరే కారణముంటుంది?’ అని ఆమె ఆశ్చర్యం వెలిబుచ్చారు. 73 ఏళ్ల ప్రధాని తెల్లవారుజామున 3.30 వరకూ పని చేసి బయిలుదేరారని ఆమె పొందుపర్చిన పోస్టులో వుంది. కింద వీరభక్తులు కొందరు నిజంగానే ఆయనకు ఏదో దివ్యప్రేరణ వుందని వంతపాడితే మరికొందరు ఎన్నికల సమయంలో ఇలాంటివి తప్పవు. మరీ దేవుణ్ని చేయొద్దని వ్యాఖ్యానించారు. వాస్తవానికి 1977లో ఎమర్జెన్సీని ప్రజలు ఓడించిన తర్వాత ఏర్పడిన జనతా ప్రభుత్వ ప్రధాని మొరార్జీ దేశాయికి 82 ఏళ్లు. వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌లతో సహా కొందరు గత ప్రధానులు ఇంతకన్నా పెద్దవారే. వారి వారి పద్ధతులలో పనిచేశారు. ప్రచారక్‌ ప్రధాన మంత్రి (పిపిఎం) నరేంద్ర మోడీ వారికన్నా ఎక్కువగా సంచరించే పనుల్లో భాగం పంచుకునే మాట నిజమే గాని అది ఆయన అలవాటు. తన ఆరోగ్యాన్ని, దారుఢ్యాన్ని ప్రశంసించవచ్చునేమో గాని దైవదత్తమైన శక్తి ఆపాదించడం హాస్యాస్పదమే. అయితే అది వ్యూహాత్మకంగానే జరుగుతున్న పని. కాంగ్రెస్‌ బలహీనపడిన పరిస్థితులలో మిగిలిన పార్టీలను కూడా బిజెపి తన వైపు తిప్పుకోవడంతో ఒంటరిగా ఆధిక్యత సాధించిన మాట నిజమే. అయితే ఇదివరలో ఎవరూ రెండు సార్లు ప్రధాని కానట్టు, అదేదో అద్భుతమైనట్టు అదేపనిగా చెప్పుకోవడం వాస్తవికత కాదు. మోడీని దేశానికి నేతగానే గాక విశ్వగురువంటూ ఆయన వల్లనే అంతర్జాతీయ సంక్షోభాలు ఆగిపోతున్నాయని, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చూడగలిగారని పొగడ్డం వెగటు పుట్టిస్తుంది. మతాన్ని, దేవుణ్ని వాడుకోవడం కాస్త తననే దైవాంశ సంభూతుడుగా, తనే ఒక మత ప్రవక్తగా చేసే ప్రక్రియ రాబోతున్నట్టు కనిపిస్తుంది. ఆ భ్రమను కాపాడటానికి మోడీ నిరంతరం తపిస్తూనే వుంటారు. ఈ మధ్య సముద్రగర్భంలోని ద్వారకా శిథిలాల దగ్గర ప్రణామం చేయడానికి నీళ్లలో మునిగిరావడం పెద్ద ప్రచారాంశమైంది. నిజానికి అక్కడ దూకడం, తేలడం తప్ప మిగిలింది కనిపించదు. ఆయనను పొగుడుకోవడం తప్ప మరేమీ మిగలని పాలక కూటమి పరిస్థితిని ఇది ప్రతిబింబిస్తుంది.

  • నేతలపై గాలం, పార్టీలపై దాడి

నిజంగా బిజెపికి, మోడీకి అంత సత్తా వుంటే అహోరాత్రాలు అన్ని కసరత్తులు చేయవలసిన అవసరమే వుండేది కాదు. ఉదాహరణకు శనివారం నాడు 195 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇందుకోసం చాలా లోతైన సర్వేలు జరిపారట. తమాషా ఏమంటే తమ పార్టీనే గాక అవతలి పార్టీలలో బలమైన అభ్యర్థులున్నా ముందే ప్రజాభిప్రాయం తెలుసుకుని వారిని తమవైపు తిప్పుకోవడం ఎలాగో పాచికలు వేశారట. ఇందులోని రాజకీయ అనైతికతను గురించి విడిగా చెప్పాల్సిన అవసరమేముంది? గెలవడం ముఖ్యం, ఎలా ఎవరితో ఏ పద్ధతిలో అనేది అప్రస్తుతం. ఈ సూత్రంతోనే మోడీ-అమిత్‌ షా ద్వయం లెక్కలేనన్ని కుట్రలతో ప్రతిపక్ష శిబిరాన్ని చిందరవందర చేయడానికి ప్రయత్నించింది. వ్యతరేకించే మీడియాను, మేధావులను, రచయితలు, కళాకారులను, ఉద్యమకారులను వేటాడుతున్నది. న్యాయ వ్యవస్థ కూడా ఒత్తిడికి గురవుత్నునట్టు అత్యున్నత న్యాయమూర్తులే అనేకసార్లు ఆవేదన వెలిబుచ్చిన పరిస్థితి. ఇందుకోసం నిజాయితీపరులైన న్యాయమూర్తుల నియామకాలు తొక్కిపట్టడం, ఉద్యోగ విరమణ తర్వాత పదవుల ఎరలు పరిపాటిగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో ఇక ప్రతిపక్షాలనూ ప్రజా ఉద్యమాలను సహించే ప్రసక్తి లేకుండా పోతున్నది. రైతాంగ ఆందోళనను అణచివేయడానికి రాజధానిని బహిరంగ చెరసాలగా మార్చిన తీరే ఇందుకు తాజా నిదర్శనం.

  • నిజంగా అంతుందా?

ఇవన్నీ ఒక ఎత్తయితే రాబోయే ఎన్నికలలో ఎలాగైనా మూడోసారి గెలవాలని మోడీ బృందం చేస్తున్న విన్యాసాలు, విపరీత పోకడలు అత్యంత అప్రజాస్వామికంగా వున్నాయి. మానసికంగా తమ మాటకు ఎదురు లేదనే భావన పెంచడం ఇందులో మొదటిది. రాబోయేది తామేనని నమ్మించడం రెండవది. గతంలో కాంగ్రెస్‌ 30 ఏళ్లు పాలించినట్టే ఇప్పుడు బిజెపి వంతు వచ్చిందన్న వాతావరణం కలిగించడంలో పరమార్థం అదే. అయితే అప్పటికీ ఇప్పటికీ దేశ రాజకీయ దృశ్యంలో బలాబలాలలో వచ్చిన మార్పులను చూసిన వారెవరైనా ఇది కేవలం భ్రమేనని చెప్పగలరు. తన రాజకీయ మిత్రులతో కలసి దేశంలో కేవలం 15 రాష్ట్రాలు అంటే ఇంచుమించు సగం మాత్రమే బిజెపి పాలించగలుగుతున్నది. దక్షిణాన తూర్పున బాగా వెనకబడి వుంది. ఈ లోటు భర్తీ చేసుకోవడం కోసం మోడీ పడని పాట్లు లేవు. ఈ వారంలోనే ఆయన తమిళనాడు, కేరళ పర్యటించారు. తెలంగాణకు రాబోతున్నారు. ఎ.పి కి సంబంధించి వర్చ్యువల్‌ పద్ధతిలో ప్రారంభోత్సవాలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కారును ఇబ్బంది పెట్టడానికి ఇ.డి, సిబిఐలను ప్రయోగిస్తున్నారు. తమిళనాడు కేరళ, ఎ.పి తెలంగాణలలో ఇప్పటికీ కావలసినంతగా వాటిని దుర్వినియోగం చేశారు. అయితే మోడీ లేకుంటే ఇ.డి అంటూ దాన్ని ఆయనకు పర్యాయపదంగా చేశారు. ఇంతటి అప్రజాస్వామిక పాలన ఈ తరహాలో దేశం ఇదివరకెన్నడూ చూడలేదు. అయితే ఆయన కార్పొరేట్లకు వరాల వర్షం కురిపిస్తూ సంఘ పరివార్‌ ఎజెండాను తుచ తప్పకుండా అమలు చేస్తారు గనక ఈ రెండు బలమైన వర్గాలు వత్తాసునిస్తున్నాయి. వారి చేతుల్లోని బడా మీడియా ఎప్పుడూ ఆయనను కీర్తించే పనిలో మునిగి తేలుతున్నది. 2024 హ్యాట్రిక్‌ గీతావళి ఇందులో ఇప్పుడు ముందుకొచ్చి కూర్చుంది.

  • కసరత్తులో ఎత్తులు

గత నాలుగురోజులుగా వింటున్న ఎన్నికల కసరత్తుల గురించే చూద్దాం. తమిళనాడులో అన్నాడిఎంకెను, కర్ణాటకలో జెడిఎస్‌ను దారికి తెచ్చుకున్న బిజెపి కేరళలో కళ్లు తేలేయక తప్పలేదు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు అక్కడ శత్రువులు. దేశంలో మిత్రులని మోడీ అక్కడ ఎద్దేవా చేసి వచ్చారు. అంతర్గత విబేధాలున్నా బిజెపిని అడ్డుకోవడమనే కేరళ విశిష్టత ఆయనకు నచ్చలేదు. ఇంత విలక్షణమైన రాజకీయ సంస్కృతి మరెక్కడా చూడం. దురదృష్టవశాత్తూ కాంగ్రెస్‌ ఈ వాస్తవాన్ని గుర్తించి బాధ్యతగా వ్యవహరించే బదులు సిపిఎం, వామపక్షాలను దెబ్బతీయడమే కార్యక్రమంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా వెళ్లి ఎల్‌డిఎఫ్‌పై రాళ్లు విసిరి వచ్చారు. నిజానికి హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌వారి క్రాస్‌ ఓటింగ్‌తో గెలిచిన బిజెపి ఆ సర్కారును కూలదోయడానికి సర్వసిద్ధంగా వుంది. అదే జరిగితే తర్వాతి లక్ష్యం తెలంగాణ అనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఆ అవకాశం లేదని టి.కాంగ్రెస్‌ నాయకులు గాంభీర్యం చూపిస్తున్నా ముప్పు వుండనే వుంటుంది. హిమాచల్‌ గతే ఇక్కడా పడుతుందని బిజెపి ఎంపీలు కె.లక్ష్మణ్‌, అరవింద్‌, బండి సంజరు వంటి వారు రోజూ బెదిరిస్తున్నారు. అసలు రేవంత్‌నే ఏక్‌నాథ్‌ షిండేలా అవుతారని అవహేళన చేస్తున్నారు. వీటిపై కాంగ్రెస్‌ నుంచి నిజానికి రావలసినంత స్పందన, నిరసన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఎ.పి లోనైతే గత ప్రస్తుత పాలక పార్టీలైన టిడిపి (జనసేన సహితంగా), వైసిపిలు బిజెపి పల్లకీ మోయడానికే పోటీలు పడుతున్నాయి. పోటాపోటీగా వారు జరిపే సభల్లో పరస్పర దూషణలు తప్ప ఎక్కడా బిజెపిపై, మోడీపై పెదవి కదిపే ప్రసక్తి వుండదు. మోడీని మూడోసారి ప్రధానిని చేయడమే లక్ష్యమని పవన్‌ కళ్యాణ్‌ మొన్న తాడేపల్లిగూడెం సభలో ప్రకటించేశారు. దేశంలోనూ ప్రత్యేకించి దక్షిణాదిలోనూ మరెక్కడా ఈ విధంగా మూడు పాలక పార్టీలూ బిజెపిని మోసే పరిస్థితి చూడలేం! విచిత్రమేమంటే టిడిపి, జనసేన ఇంతగా లోబడిపోతున్నా తన రాజకీయ మాయాజాలం తేలని బిజెపి పొత్తులపై స్పష్టత ఇవ్వకుండా వారిని తిప్పుకుంటున్నది. ఇది రాసే సమయానికి బిజెపి ఒంటరిగా వెళుతుందని సంకేతాలు వస్తున్నా పొత్తు అవకాశాన్ని తోసిపుచ్చలేము. ఇందుకు ప్రతిగా కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రయోజనాలు లౌకికతత్వం వంటివాటిపై ప్రత్యేకంగా కార్యక్రమాలు జరపడం చూస్తున్నాం. దేశంలో ఇతర చోట్ల కూడా వామపక్షాలు గానీ, ‘ఇండియా’లో భాగస్వాములుగా వున్న సమాజ్‌వాది, ఆప్‌, ఆర్‌జెడి వంటి పార్టీలు గానీ చేతులు కలిపి నడిచేందుకే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి ప్రతిపక్షాలలో పెద్దదైన కాంగ్రెస్‌ పార్టీయే హిమాచల్‌ పరిణామాల తర్వాత సర్కారును కాపాడుకోలేక సతమతమవుతున్నది. మొన్న ఓడిపోయిన మధ్యప్రదేశ్‌లోనూ కమల్‌నాథ్‌ వంటి నాయకులే కమలం పంచన చేరే సూచనలు వదులుతున్నారు. లౌకిక పార్టీలపై వామపక్షాలపై బిజెపి దాడి పెరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ అంతర్గత బలహీనతలు, అనైక్యత నుంచి బయటపడలేకపోవడం పెద్ద సవాలే. కాంగ్రెస్‌ లొసుగులు ఆసరా చేసుకుని మోడీ తన దాడినంతటికీ ఆ పార్టీని ముందు పెట్టి ప్రతిపక్ష శిబిరంపై దాడి చేయడం వాస్తవం. ఆ దాడిని ఏకోన్ముఖంగా ఎదుర్కోగల చేవ కూడా కాంగ్రెస్‌ ప్రదర్శించలేకపోతున్నది. హిమాచల్‌లో సంక్షోభంతో పాటు యు.పి లో ఒక రాజ్యసభ సీటు కోల్పోవడం కూడా కాంగ్రెస్‌, ఎస్‌పిల నిరుత్సాహానికి కారణమైంది. రారుబరేలీలో సోనియా తప్పుకోవడం, ప్రియాంక అక్కడకు వస్తారా లేదా రాహుల్‌ పోటీ చేస్తారా వంటివే పెద్ద ప్రశ్నార్థకాలై కూర్చున్నాయి. కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలలో లోపాలు, అవకాశవాదాలు కొన్ని ఆటంకాలుగా వున్నా మొత్తానికి బిజెపిని నిలవరించే అవకాశాలు చాలా వున్నాయనేది వాస్తవమే. బిజెపికి స్వంతంగా 370 స్థానాలు వచ్చే అవకాశమే లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నొక్కి చెప్పడం గమనించదగిన విషయం.

 – తెలకపల్లి రవి

➡️